అనేక మంది స్వతంత్ర సమరయోధల ప్రాణత్యాగం ఫలితంగా భారత దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ సందర్భంగా ఆగస్టు 15, 1947 నుండి స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్క భారతీయుడు జరుపుకుంటారు. నేడు భారత్ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని జెండాను ఎగురవేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. అటు విజయవాడలో సీఎం జగన్ మోహన్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
కాగా, 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)పై భారత జెండా (Indian Flag)ను ప్రదర్శించారు. అర్ధరాత్రి 12 గంటల ఒక్క నిమిషానికి బుర్జ్ ఖలీఫాపై ఎల్ఈడీ లైట్లతో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఆ సమయంలో భారత జాతీయ గీతం కూడా వినిపించింది. ఈ అద్భుత దృశ్యాలను చూసిన అక్కడి భారత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరు కన్నుల విందుగా చూస్తూ ఆనందాన్ని పొందారు. విద్యుత్ లైట్లతో అక్కడి పరిసరాలు ధగధగ మెరిసిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.