సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మూవీ ‘జైలర్’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ జైలర్ సక్సెస్ను ఆస్వాదిస్తున్నారు. ఆయన ఉత్తర భారతంలో పలు పుణ్య క్షేత్రాలు సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉత్తర్ప్రదేశ్ వెళ్లారు. అక్కడ సాయంత్రం సమయంలో.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసానికి చేరుకున్నారు. సీఎంను కలవగానే రజనీకాంత్.. ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు లఖ్నవులోని రాజ్భవన్లో అక్కడి గవర్నర్ ఆనందీ బెన్ను మర్యాదపూర్వకంగా కలిశారు రజనీ. ఆదివారం రజనీ అయోధ్యకు వెళ్లనున్నారు.
గతవారం రజనీకాంత్ ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. సూపర్స్టార్కు అక్కడి పండితులు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆయన స్వర్ణ హారతిలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో రజనీ.. రిషికేష్లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమాన్ని సందర్శించి.. అక్కడున్న వారతో ముచ్చటించారు. కాగా తాజాగా ఉత్తరాఖండ్ అల్మోరాలోని ద్వారహత్కు వెళ్లారు. ఆశ్రమంలోని సాధువులను కలిసి.. అక్కడి మహావతార్ బాబా గుహలో 30 నిమిషాలు ధ్యానం చేశారు. ఇక ఆయనను చూసేందుకు వచ్చిన అభిమానులతో సెల్ఫీ దిగారు. అనంతరం ఝార్ఖండ్ గవర్నర్తో భేటీ అయ్యారు.