గూడూరు – మనుబోలు మధ్య భారీ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసింది దక్షిణ మధ్య రైల్వే. కింద రెండు బ్రాడ్ గేజ్ లు వెళుతుండగా.. వాటిపై నుంచీ మరొక బ్రాడ్ గేజ్ తో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశారు. ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో శరవేగంగా ఫ్లైఓవర్ పూర్తి చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. రేణిగుంట – విజయవాడ, చెన్నై – రేణిగుంట మధ్య పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని దీని నిర్మాణం పూర్తి చేశారు.. సౌత్ సెంట్రల్ రైల్వే, సదరన్ రైల్వేల మధ్య పెద్ద జంక్షన్ గూడూరు కావడంతో.. ట్రాఫిక్ కంట్రోల్ కు ఫ్లైఓవర్ తప్పనిసరి అని గుర్తించిన రైల్వే శాఖ.. ప్రజలకు సమయాభావం కాకుండా ఉండేలా ఫ్లైఓవర్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసింది.
గూడూరు-మనుబోలు మధ్య మూడో లైన్ పనుల్లో భాగంగా 2.2 కిలోమీటర్ల పొడవున నూతన రైలు ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ విజయవాడ – రేణిగుంట, చెన్నై నుండి విజయవాడ రైళ్ళ రాకపోకలకు ఎటువంటి ఆటంకము లేకుండా రైళ్లు సజావుగా నడపడానికి వీలు కల్పిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే తన రైలునెట్వర్క్ పరిధిలోని రైలు కదలికలను సులభతరం చేయడానికి రైలు మౌలిక సదుపాయాలను నిరంతరం అభివృద్ధి చేస్తూ, అధిక సంఖ్యలో రైళ్లు నడపడానికి దోహదపడుతు రైళ్ల నిర్వహణను సులబభతరం చేస్తుంది. ఇందులో భాగంగా విజయవాడ డివిజన్లోని గూడూరు-మనుబోలు రైల్వే స్టేషన్ల మధ్యకొత్త రైల్ ఓవర్ రైల్ (ఆర్. ఓ.ఆర్)ను నిర్మించి ప్రారంభించారు. గూడూరు-మనుబోలు మధ్య మూడో లైన్ పనుల్లో భాగంగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్.వీ.ఎన్.ఎల్) ఈ ఆర్. ఓ.ఆర్ ఫ్లై ఓవర్ను నిర్మించింది.
2.2 కి.మీల నిడివితో నిర్మించిన ఈ రైల్ ఫ్లైఓవర్ దక్షిణ మధ్య రైల్వేలో 7వ రైల్ ఓవర్ రైల్ (ఆర్.ఓ.ఆర్) గా నిలిచింది. ఇంతేకాకుండా ఈ జోన్లో అతి పొడవైన ఆర్ఓఆర్/రైల్ ఫ్లైఓవర్ కూడా. గతంలో జోన్ లో అత్యంత పొడవైన రైల్ ఫ్లైఓవర్ 40 మీటర్లు మాత్రమే ఉండేది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 2.2 కిలోమీటర్ల పొడవుకలిగిన ఈ ఫ్లైఓవర్ను కేవలం రెండేళ్ల వ్యవధిలో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ పిఎస్ సీ (ప్రీ-స్ట్రెస్డ్ కాంక్రీట్) మరియు కాంపోజిట్ గర్డర్లను కలిగిఉంది.
ఇది స్వాభావికమైన అధిక ప్రవాహ సామర్థ్యం కలిగి మరియు తక్కువ నిర్వహణ ఖర్చులతో నిర్మించబడినది. దీని నిర్మాణానికి అదనంగా ఫ్లైఓవర్ యొక్క సబ్స్ట్రక్చర్, పిఎస్ సీ గిర్డర్లు మరియు స్లాబ్లకు హై గ్రేడ్ కాంక్రీట్ మరియు స్ట్రక్చరల్ స్టీల్ను ఉపయోగించారు. ఈ సింగిల్ లైన్ వంతెన రెండు దిశలలో రైళ్ల కదలిక కోసం పొందించబడింది. 32.5 టన్నుల యాక్సిల్ లోడ్తో రైళ్లను సజావుగా నడిపేందుకు ఉపయోగపడుతుంది . గ్రాండ్ ట్రంక్ రూట్లో ఉన్న గూడూరు రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ రైల్వేల మధ్య వివిధ రైళ్ల రాకపోకలకు ఇంటర్చేంజ్ పాయింట్ గా ఉంది. నిరంతరం రైళ్ల రాక పోకలతో రద్దీగా ఉన్న ఈ విభాగంలో రైళ్ల కదలికలను సులభతరం చేయడానికి ఈ కొత్త రైలు ఫ్లైఓవర్ సహాయపడుతుంది. ఈ ఫ్లైఓవర్ ప్రారంభించడం వల్ల గూడూరు స్టేషన్ మీదుగా విజయవాడ నుండి రేణిగుంట మరియు చెన్నై నుండి విజయవాడ మధ్య ఏకకాలంలో నడిచే రైళ్ల రాకపోకలు సులభతరం అవుతాయి.