ఇప్పటివరకు ఎవరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపేందుకు ప్రయత్నించిన రష్యా విఫలమైంది. భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 కంటే చాలా ఆలస్యంగా.. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కాస్మోస్ లూనా -25 పేరుతో ఒక వ్యోమ నౌకను పంపించింది. ఇది కూడా అచ్చం చంద్రయాన్ 3 ప్రయోగం లాగానే చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి పరిశోధనలు చేయాలని భావించింది. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆగస్టు 21 వ తేదీన జాబిల్లి దక్షిణ ధ్రువంపై లూనా 25 దిగాల్సి ఉంది. అయితే చంద్రుడి కక్ష్యలో ప్రవేశించేవరకు విజయవంతంగా వెళ్లిన లూనా 25 అంతరిక్షనౌక.. చివరకు మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. దీంతో చంద్రుడి ఉపరితలంపై క్రాష్ అయినట్లు రోస్కాస్మోస్ ప్రకటించింది.
దాదాపు 50 ఏళ్ల తర్వాత రష్యా మొదటిసారి జాబిల్లిపై పరిశోధనలు చేసేందుకు ఈ లూనా 25 అంతరిక్షనౌకను ప్రయోగించింది. అయితే ఈ లూనా 25 స్పేస్క్రాఫ్ట్ చంద్రయాన్ 3 కన్నా ఆలస్యంగా వెళ్లినా దానికంటే రెండు రోజుల ముందు అంటే ఆగస్టు 21 వ తేదీన జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగాల్సి ఉంది. అయితే ల్యాండింగ్కు ముందు నిర్వహించిన కొన్ని ప్రక్రియల సమయంలో లూనా 25 చంద్రునిపై కూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ వెల్లడించింది. అంతకుముందు లూనా 25 తో.. తమకు సంబంధాలు తెగిపోయాయని రోస్కాస్మోస్ తెలిపింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టామని.. ప్రాథమిక పరిశోధనల ప్రకారం ల్యాండర్ చంద్రుని ఉపరితలంతో ఢీకొన్న తర్వాత ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే లూనా 25 స్పేస్క్రాఫ్ట్ కూలిపోయినట్లు ప్రకటించింది.