ప్రధాని మోదీ నిజామాబాద్ జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బీజేపీ శ్రేణులు. జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) ప్రకటనతో నిజామాబాద్ బహిరంగ సభను ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞత సభగా విజయవంతం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం నిజామాబాద్ రానున్న మోదీ.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో ఆయా శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పీఎంఓ అధికారులు, ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(Special Protection Force) రంగంలోకి దిగాయి. గిరిరాజ్ కళాశాల మైదానంలో లక్ష మందితో బీజేపీ బహిరంగ సభను తలపెట్టింది.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలతో పాటు.. కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు సభకు తరలి రానున్నాయి. మహబూబ్నగర్ సభలో తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు ప్రకటన చేయడంతో బీజేపీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. పెద్ద సంఖ్యలో పసుపు రైతులు సభకు తరలి రావాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Nizamabad MP Dharmapuri Arvind) ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8 వేల 21 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. రామగుండం ఎన్టీపీసీలో నూతంగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును.. రాష్ట్ర ప్రజలకు మోదీ అంకితం చేస్తారు. 800 మెగావాట్లలో 680 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ వినియోగించుకోనుంది. నిజామాబాద్ పర్యటనలో భాగంగా విద్యుత్, ఆరోగ్య, రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.1360 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రధాని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లా కేంద్రాల్లో ఉన్న 50 పడకల ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకులను నిర్మించనునున్నారు. అలాగే రూ.305 కోట్లతో.. 340 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తైన రైల్వే లైన్లను మోదీ ప్రారంభించనున్నారు.