పాలమూరు జిల్లా వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఐటీ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉందని.. బీజేపీ స్టీరింగ్(BJP) అదానీ చేతిలోకి వెళ్లిపోయిందని ట్విటర్ వేదికగా మంత్రి ఎద్దేవా చేశారు. నమో అంటే.. నమ్మించి మోసం చేయడమేనని ప్రజలకు తెలుసని విమర్శించారు. బీజేపీ హయాంలో కిసాన్ సమ్మాన్(Kissan Samman) కింద ఇచ్చింది కేవలం నామమాత్రమేనని.. కానీ ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ 70 లక్షల మంది రైతులకు.. 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం తెలుసుకుంటే మంచిదని చురకంటించారు. రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం.. మిలియన్ డాలర్ జోక్ అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలోనే.. రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భం తెలంగాణలోనే(Telangana) ఆవిష్కృతమైందని కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు.
అన్నదాత అప్పులు మాఫీ చేసి జైకిసాన్ ప్రభుత్వం తమది అని.. కార్పొరేట్ దోస్తులకు రూ.14.5 లక్షల కోట్ల రుణాలను రద్దుచేసిన.. నై కిసాన్ సర్కారు బీజేపీదని మండిపడ్డారు. కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతుహంతక రాజ్యం బీజేపీదని దుయ్యబట్టారు. పదేళ్లపాటు విభజన హామీలను పాతరేసి.. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి, ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లాడితే నమ్మేదేవరు అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రాజెక్టుల వల్ల చుక్క నీరు రాలేదనడం.. బీజేపీ(BJP) అవివేకానికి నిదర్శనం అన్నారు. తెలంగాణలో సాగుతోంది సాగునీటి విప్లవం.. తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన బీజేపీనా మాట్లాడేది అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే నూకలు తినమన్న నాయకుల అవమానకర మాటలు.. తెలంగాణ రైతులు మరిచిపోలేదన్నారు. నాయకులు ఎన్ని చెప్పినా.. బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయన్నారు. నిన్న కాళేశ్వరం అయినా.. నేడు పాలమూరు ప్రాజెక్టు అయినా.. ప్రపంచ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప మానవ నిర్మిత అద్భుతాలు.. భవిష్యత్తు ఇరిగేషన్ (Irrigation) రంగానికే సరికొత్త పాఠాలు అని కేటీఆర్(KTR) పేర్కొన్నారు.