ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. మరోసారి సైనిక స్థావరాలను సందర్శించారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైనిక బలగాలను ఆదేశించిన కిమ్.. వాటి సంసిద్ధతను పర్యవేక్షించారు. ఉత్తర కొరియా ప్రధాన ఆయుధాల కర్మాగారాలను సందర్శించి.. క్షిపణులు సహా మిగిలిన ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచాలని ఆదేశించారు. వచ్చే వారంలో సైనిక విన్యాసాలు ప్రారంభిస్తామని.. దక్షిణ కొరియా- అమెరికా ప్రకటించిన నేపథ్యంలో కిమ్ ఆకస్మికంగా ఆయుధ స్థావరాలను సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యూహాత్మక క్షిపణులు, మొబైల్ లాంచ్ ప్లాట్ఫామ్లు, సాయుధ వాహనాలు, ఫిరంగి షెల్లను ఉత్పత్తి చేసే కర్మాగారాలను కిమ్ సందర్శించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
కిమ్తో పాటు ఉన్నతాధికారుల బృందం కూడా ఉన్నట్లు తెలిపింది. క్షిపణి కర్మాగారంలో ఆయుధ కార్యక్రమాలను మరింత పెంచాలని స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను కిమ్ ఆదేశించారు. ఫ్రంట్ లైన్ మిలిటరీ యూనిట్ల అవసరాలకు అనుగుణంగా క్షిపణులను భారీగా ఉత్పత్తి చేయాలని కూడా ఉత్తర కొరియా అధినేత స్పష్టం చేశారు.
మరోవైపు తుపాను ధాటికి అతలాకుతలమైన ప్రాంతాలను కూడా కిమ్ పరిశీలించారు. వరదల హెచ్చరికలు ఉన్నప్పటికీ సరైన విధంగా సిద్ధంకాని అధికారులపై కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కిమ్.. అందుతున్న సహాయ చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి కీలక సూచనలు చేశారు. వరదల వల్ల దాదాపు 200 హెక్టార్ల వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయని ఉత్తరకొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.