తాను నమ్మిన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటాన్ని నడిపిన కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji), తెలంగాణ బడుగు, బలహీన వర్గాల చైతన్యానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(K. Chandrasekhar Rao) అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా, వారు తెలంగాణకు అందించిన సేవలను, చేసిన త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం నాటి తరాన్ని ఎంతో ప్రభావితం చేసిందని సీఎం అన్నారు.
ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా ఎన్నో పదవులను నిర్వహించిన బాపూజీ, తెలంగాణ(Telangana) కోసం మంత్రి పదవిని త్యజించి నిబద్ధత కలిగిన నేతగా చరిత్రలో నిలిచారని సీఎం అన్నారు. బాపూజీ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాచరణ ద్వారా నెరవేరుస్తున్నదని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సీఎం స్పష్టం చేశారు. వారి స్మారకార్థం పలు కార్యక్రమాలు చేపట్టామని, తెలంగాణ ప్రభుత్వం ప్రతి యేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ ఆయనకు నివాళి అర్పిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానమే కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji)కి నిజమైన నివాళి అని సీఎం అన్నారు.
నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు.[1] స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969, 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు.