జీ20 సమావేశాల కోసం వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియాకు రానున్నారు.ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ మేరకు రెండు దేశాల సంబంధాలపై సెప్టెంబర్ 8న ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు వైట్హౌస్ వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పేదరిక నిర్మూలన, ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థల బలోపేతం లాంటి అనేక ప్రపంచ సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపింది.సెప్టెంబర్ 7న దిల్లీకి చేరుకోనున్న బైడెన్.. 8న మోదీతో భేటీ కానున్నారు. అనంతరం 9, 10 తేదీల్లో జరిగే జీ20 సమావేశాల్లో పాల్గొననున్నారు. అనంతరం 10 తేదీన వియత్నాంకు బయలదేరనున్నారు. జీ20కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్న తీరును అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారని శ్వేతసౌధం తన ప్రకటనలో చెప్పింది. ఆర్థిక సహకారానికి పాటుపడే జీ20 కూటమికి తాము కట్టుబడి ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారని పేర్కొంది. 2026లో ఈ కూటమికి నాయకత్వం వహించడానికి అమెరికా ఎదురుచూస్తోందని వివరించింది.
దేశ రాజధాని దిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ-20 ప్రపంచ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 29 దేశాల అధినేతలతో పాటు ఐరోపా సమాఖ్య, ఆహ్వానిత అతిథి దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. G-20 అధ్యక్ష బాధ్యతల్ని 2022 డిసెంబర్ 1న ఇండోనేసియా నుంచి భారత్ స్వీకరించింది. జీ-20 సమావేశం దృష్ట్యా దిల్లీలోని బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, మార్కెట్లు సహా అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు 3 రోజులు మూసివేయనున్నారు. జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గైర్హాజరుకానున్నట్లు సమాచారం. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సమావేశాలకు రావడం లేదని ప్రకటించగా జిన్పింగ్ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సుకు జిన్పింగ్ స్థానంలో చైనా ప్రధాన మంత్రి లీ చియాంగ్ హాజరుకానున్నట్లు సమాచారం.