స్కిల్ డెవలప్ మెంట్ స్కాం(Skill Development Scheme) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu is the leader of TDP) బెయిల్ పిటిషన్పై ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగే అవకాశం ఉంది. రిమాండు గడువు, రెండు రోజుల కస్టడీ ఆదేశాలు ఆదివారంతో ముగియడంతో.. చంద్రబాబును (Chandrababu ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టు(ACB Court) న్యాయాధికారి హిమబిందు ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ను అక్టోబర్ 5 వరకు పొడిగించిన న్యాయాధికారి.. బెయిల్ పిటిషన్ నేడు విచారణకు వస్తుందని తెలిపారు.
రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు (Himabindu)ఎదుట ఆదివారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాల సమయంలో హాజరుపరచారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో న్యాయాధికారి మాట్లాడారు. మీపై ప్రస్తుతం వచ్చినవి అభియోగాలు మాత్రమేనన్నారు. దర్యాప్తు చేశాక నిజమా.. కాదా అనేది తేలుతుందన్నారు. సీఐడీ కస్టడీలో మొదటిరోజు విచారణ ఆలస్యంగా ప్రారంభమైందని తెలిసిందన్న ఆమె.. నిజమేనా అని ప్రశ్నించారు. మీ న్యాయవాది మీకు కనిపించేంత దగ్గర్లో ఉండేందుకు అనుమతిచ్చామన్న న్యాయాధికారి.. ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలన్నామని గుర్తు చేశారు. ఈ సౌకర్యాలన్నీ కల్పించారా? థర్డ్డిగ్రీ (Third Degree) ప్రయోగించి ఏమైనా ఇబ్బంది పెట్టారా? వైద్యపరీక్షలు నిర్వహించాలని చెప్పాము.. కోర్టు ఆదేశాల మేరకు సౌకర్యాలు కల్పించారా?’’ అని ఆరా తీశారు.
భౌతికంగా ఏమీ ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు బదులిచ్చారు. ‘‘దర్యాప్తునకు పూర్తిగా సహకరించానన్న చంద్రబాబు.. ఏ తప్పూ చేయలేదు.. ఈ కేసుతో నాకు సంబంధం లేదన్నారు. కావాలనే ఇరికించారన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు క్యాబినెట్ నిర్ణయమన్న చంద్రబాబు.. దానికి తననెలా బాధ్యుడ్ని చేస్తారని ప్రశ్నించారు. సీఐడీ సమర్పించిన దస్త్రాలను పరిశీలించాలని ఆయన న్యాయాధికారిని కోరారు.
స్పందించిన న్యాయాధికారి ‘‘దర్యాప్తు అనేది ఓ ప్రొసీజర్ మాత్రమేనన్నారు. ప్రస్తుతం మీరు జ్యుడిషియల్ రిమాండులో ఉన్నారన్న ఆమె.. మీపైన వచ్చినవి ఆరోపణలు మాత్రమేనన్నారు. తప్పుచేశానని అనుకోవద్దన్న న్యాయాధికారి.. సోమవారం మీ బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందన్నారు. ఈ దశలో మీరు తప్పుచేశారనే ప్రస్తావన ఉండదన్నారు. ఇప్పటికిప్పుడు నిజనిర్ధారణ జరగదన్న ఆమె.. పూర్తిస్థాయిలో విచారణ చేశాక గానీ తప్పుచేశారా.. లేదా అనేది తేలదన్నారు. అందుకు కోర్టుకు కొంత సమయం పడుతుందన్న ఆమె.. ఇదివరకే చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నా.. ఈ దశలో మీరు తప్పుచేసినట్లు కాదు’’ అని వ్యాఖ్యానించారు.
కేసులో పూర్తి దస్త్రాలను సీఐడీ తనకు ఇవ్వట్లేదని చంద్రబాబు కోర్టుకు చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయాధికారి.. ‘రిమాండు రిపోర్టుతో పాటు సీఐడీ పోలీసులు కోర్టులో 600 పేజీలను వేశారని అన్నారు. మీ న్యాయవాదిని అడిగి తీసుకొని పరిశీలించండి అని చంద్రబాబుకు చెప్పిన ఆమె.. అప్పుడు కేసు పరిస్థితి మీకు అర్థమవుతుందన్నారు. దస్త్రాలను మీకు అందజేయాలని న్యాయవాదులకు చెబుతాను’ అని పేర్కొన్నారు.
చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు.. జ్యుడిషియల్ రిమాండును పొడిగించొద్దని కోరారు. సీఐడీ దాఖలుచేసిన మెమోలో సరైన కారణాలు లేవన్నారు. దీనిపై న్యాయాధికారి స్పందిస్తూ.. సవరించిన మెమో వేయాలంటూ సీఐడీకి సూచించారు. కొద్దిసేపటి తర్వాత విచారణ చేసి.. సీఐడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండును అక్టోబరు 5వ తేదీ వరకు పొడిగించారు.