దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా 140 పోలీసులను ఎంపిక చేయగా.. ఏపీ, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు. ఆగస్టు 15 సందర్భంగా కేసుల దర్యాప్తులో ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంశాఖ మెడల్స్ అందించడం ఆనవాయితీగా వస్తోంది. అధికారిక ప్రకటన ప్రకారం అవార్డు గ్రహీతలలో 22 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. 2023 సంవత్సరానికి గానూ “సెంట్రల్ హోంమినిస్టర్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్” కింద 140 మంది పోలీసు సిబ్బందికి కేంద్ర సర్కారు పతకాలు అందించనుంది.
కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు ప్రతీఏటా కేంద్ర హోంమంత్రి పేరిట పతకాలు అందిస్తారు. ఈ ప్రతిభా పురస్కారాలను 2018లో ప్రారంభించారు. నేర పరిశోధనలో ఉన్నతమైన, వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం, దర్యాప్తులో ప్రతిభ చూపిన వారికి ప్రతి సంవత్సరం ఆగస్టు 12న పతకాలు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో 140 మంది పోలీసులకు మెడల్స్ ప్రకటించగా.. ఈ ఏడాది అవార్డులు అందుకోనున్న వారిలో సీబీఐ నుంచి 15 మంది, ఎన్ఐఏ నుంచి 12 మంది, ఉత్తర్ ప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్థాన్ నుంచి 18 మంది, తమిళనాడు నుంచి 08, మధ్యప్రదేశ్ నుంచి 7, గుజరాత్ నుంచి ఆరుగురు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 10 ఎంపిక అయ్యారు.