మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది. ఈ సంస్థకు చెందిన కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి బదిలీ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు న్యాయపరిధి అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. మరోవైపు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కేసును విచారించి తీర్పును వెలువరించే స్వేచ్ఛను తెలంగాణ హైకోర్టుకే వదిలేస్తూ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
కేసులో ఉన్న మెరిట్స్ ఆధారంగా తెలంగాణ హైకోర్టు విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. చెప్పాలనుకున్న విషయాలన్నీ తెలంగాణ హైకోర్టుకే తెలపాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులకు సూచించింది. హైకోర్టు తుది ఆదేశాలు వెలువడిన తర్వాత సుప్రీంకోర్టుకు రావొచ్చని తెలిపింది.