ఏపీ రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను డిసెంబర్ లో విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఇతర రాజ్యాంగ ధర్మాసనాల కేసులు విచారించాల్సి ఉందని, నవంబర్ వరకూ ఈ కేసుల విచారణ జరుగుతుందని చెప్పింది. అప్పటివరకు ఈ కేసును విచారించడం కుదరదని.. డిసెంబర్ లోనే కేసు తదుపరి విచారణ ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుకి సంబంధించి పూర్తిస్థాయి విచారణ డిసెంబర్లో చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం వెల్లడించింది.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆరు నెలల్లో అమరావతి రాజధానిని నిర్మించాలని హైకోర్ట్ జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో ఈ కేసు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ చేశారు. దీంతో ఈ కేసు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదిల బెంచ్ కు బదిలీ అయింది. మరోవైపు సుప్రీం కోర్టు రిజిస్టరీ తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు వెల్లలేదని, ఈ నేపథ్యంలో కేసును విచారించడం సబబు కాదని సుప్రీం కోర్టు తెలిపింది. అయితే, ఇద్దరు ప్రతివాదులు మరణించినట్లుగా తమ వద్ద నివేదిక ఉందని, వారు మినహా మిగతా వాళ్లందరికీ నోటీసులు ఇచ్చామని అత్యున్నత ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా వారిద్దర్నీ ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని సుప్రీం కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నట్లు ఏపీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి సమ్మతించిన ధర్మాసనం వాటి వివరాలను ప్రత్యేకంగా ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది.